News In Pics: చిత్రం చెప్పే సంగతులు
Updated : 13 May 2022 01:55 IST
1/15
సాధారణంగా చెట్ల వేర్లు భూమిలోనే ఉంటాయి. కానీ, ఈ వృక్షాల వేర్లు చూస్తే మాత్రం అది అబద్ధమేమో అనుకుంటాం. ఏయూ
ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని చెట్ల భారీ వేర్లు మొత్తం గోడ ఆధారంగా విస్తరించాయి. సాధారణ వృక్షాలకు భిన్నంగా కనిపిస్తున్న
వీటిని అటుగా వచ్చిన వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
2/15
ఈ చిత్రంలో మహిళలు శీతలపానీయం బాటిల్ పట్టుకొని ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? కాదండీ బాబు ఇందులో ఉండేది తాగునీరు.
ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. ప్రత్తిపాడు పంచాయతీలోని చిన్నపల్లెకు చెందిన ఈ వనితలు గురువారం తాగునీటి బాటిల్తో ప్రత్తిపాడు
పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. కుళాయిలకు మురుగు నీరు వదిలితే ఎలా తాగాలంటూ ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి
వై.రాంబాబును నిలదీశారు. ప్రత్తిపాడులో 20 రోజుల క్రితం ఆక్రమణలు తొలగించారని, ఈక్రమంలో పైపులు పగిలిపోయాయని, అప్పటి
నుంచి మురుగు నీరు వస్తోందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్పందించిన పంచాయతీ ఇన్ఛార్జి
కార్యదర్శి రాంబాబు వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
3/15
మంగళగిరిలోని ఉపకారాగారం శిథిలమయ్యింది. కారడవిని తలపిస్తోంది. గతంలో ఈ ప్రాంత నిందితులను ఇక్కడే ఖైదు చేసేవారు.
కాలక్రమంలో కారాగారం ఇలా పూర్తిగా శిథిలమైపోవడంతో ప్రాంగణమంతా చెట్లుపెరిగి చిట్టడివిని తలపిస్తోంది.
4/15
ఒకటి కాదు రెండు కాదు వందలాది జేసీబీలు ఒకేసారి కళ్లకు కనిపించడంతో వీక్షకులు ఆసక్తిగా తిలకించారు. మధిర రైలు నిలయంలో
గురువారం విజయవాడ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఓ గూడ్సు రైలు నిండా ఇలా జేసీబీలే దర్శనమిచ్చాయి. దీంతో
ప్రయాణికులతో పాటు విషయం తెలుసుకున్న పట్టణ వాసులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించారు.
5/15
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెరకు రసం చెక్క బండి ఇది. దీన్ని గానుగలా ఓ ఆవు తిప్పుతుండగా
చెరుకు రసం తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నాడు చింతల రాజేశ్. వ్యవసాయంతోపాటు తన చదువును కొనసాగిస్తూ ఎండాకాలం చెరుకు
రసం విక్రయిస్తుంటాడు. తండ్రి లేకపోయినా అక్కా, చెల్లి పెళ్లిళ్లు చేశాడు. తల్లి పద్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఖమ్మం-తల్లాడ
రహదారిపై ఏర్పాటుచేసిన ఈ బండి జిల్లాలో ఇదే మొదటిది.
6/15
వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారులు ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. గుండాల మండలం పడుగోనిగూడెం గ్రామానికి
చెందిన చిన్నారులు సమీపంలోని కిన్నెరసాని వాగులో ఈత కొడుతున్నారు. బండలపై నుంచి వాగులోకి డై కొడుతూ ప్రమాదకర
విన్యాసాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలను ‘న్యూస్టుడే’ గురువారం ఛాయాగ్రహకంలో బంధించింది.
7/15
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన వడ్లను లారీల్లో నింపి రైస్మిల్లులకు తరలిస్తే వారు మర ఆడించి బియ్యంగా మార్చాల్సి
ఉంటుంది. మర ఆడించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో మిల్లుల వద్ద ధాన్యం సంచులు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఏ రైస్మిల్లు వద్ద చూసినా.. వేలల్లో సంచులు, మిల్లుల ముందు పదుల సంఖ్యలో లారీలు దర్శనమిస్తున్నాయి.
దీంతో రైతుల నుంచి సేకరించిన ధాన్యం అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నిజామాబాద్ నగర శివారులో
వందల రైస్మిల్లులు ఉండగా.. ఎక్కడ చూసినా లారీలే కనిపిస్తున్నాయి.
8/15
భర్తను కోల్పోయిన ఓ మహిళ 30 సంవత్సరాలుగా పురుషుడి వేషధారణలో జీవిస్తున్న ఘటనిది. తమిళనాడు
రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కాట్టునాయక్కన్పట్టి గ్రామంలో ఉంటున్న ముత్తు మాస్టర్ లుంగీ, చొక్కా ధరించి పురుషుడిలా కనిపిస్తుంది.
ఆమె అసలు పేరు పేచ్చియమ్మాల్ (60). 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గుండెపోటుతో భర్త మృతి చెందాడు.
అప్పటికే ఆమె గర్భం దాల్చింది. అనంతరం ఆడబిడ్డకు పేచ్చియమ్మాల్ జన్మనిచ్చింది. కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్లిన
ఆమెకు పురుషుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తనతోపాటు కుమార్తెను కాపాడుకునేందుకు చొక్కా, లుంగీ ధరించడం
అలవాటు చేసుకుంది. ప్రస్తుతం ఆమె రంగులు వేయడం, ఉపాధి హమీ
పనులకు వెళ్తూ జీవనం గడుపుతోంది.
9/15
ఈ చిత్రంలో కనిపిస్తున్నది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ పరిధిలో ప్రభుత్వం
ఎంపిక చేసిన ఎంఐజీ లేఅవుట్ స్థలం. అసని తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జగనన్న స్మార్ట్
టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్) స్థలంలో భారీ ఎత్తున నీరు చేరింది. ఇక్కడి ఉప్పుచెరువు ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు సమీపంలో
సర్వే సంఖ్య 297లో సుమారు 26 ఎకరాల్లో 292 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. సదరు స్థలంలో మున్సిపల్ అధికారులు రెండు దఫాలుగా
రూ.లక్షలు వెచ్చించి మట్టి తోలి చదును చేశారు. అయినా ప్రస్తుతం 3 అడుగుల లోతు వరకు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది.
10/15
ఈ చిత్రం చూస్తుంటే ఎక్కడో విస్తరించిన పెద్ద అడవి అనుకుంటున్నారు కదూ..! కానీ, పచ్చని చెట్లతో అలరారుతున్న ఈ ప్రాంతం హైదరాబాద్లోనిదే. నగరం నడిబొడ్డున 390 ఎకరాల స్థలంలో విస్తరించిన కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఇది. ఉరుకులు పరుగుల జీవితంలో అలసిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఆహ్లాదాన్ని పంచుతోంది ఈ పార్కు.
11/15
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు విజయలక్ష్మి. పాతబస్తీలోని ఫలక్నుమా నివాసి. భర్త శ్రీరామ్ కారు డ్రైవరు ఇటీవల ఎండలకు వడదెబ్బ తగిలి కడుపునొప్పితో అల్లాడిపోయాడు. కారు యజమాని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అధికంగా డబ్బులు ఖర్చవుతాయని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో ఇంటికి పంపించాడు. భర్త ఇబ్బందులు చూడలేక విజయలక్ష్మి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చింది. గతనెల 24న ఆసుపత్రిలో చేరారు. సహాయకులు ఎవరూ లేకపోవడంతో అన్నీతానే అయింది. ఒకవైపు పరీక్షల కోసం ల్యాబ్ ముందు ఎదురు చూస్తూ.. మరోవైపు సెలైన్ బాటిల్ చేతిలో పట్టుకుని నిల్చున్న చిత్రమిది.
12/15
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురుస్కరించుకొని గురువారం రాత్రి గాంధీ ఆసుపత్రి మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పాల్గొని కేకు కోసి నర్సులకు తినిపించారు. పుట్టిన పిల్లలకు తొలి స్పర్శ కన్నతల్లి కన్నా ముందే నర్సులకే దక్కుతుందని వారి సేవలను ప్రశంసించారు.
13/15
క్వీన్ ఎలిజబెత్-2కి చెందిన ప్రఖ్యాత వజ్ర మకుటం. రాణి బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న రాణి ఆభరణాల ప్రదర్శనలో ఇవి కనువిందు చేయనున్నాయి.
14/15
రోగి సహాయకులకు అందించే రూ.5 భోజనాన్ని గాంధీఆసుపత్రిలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించి అన్నార్తులకు భోజనం వడ్డించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందించేలా చేసిన ఏర్పాట్లు రోగి సహాయకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
15/15
ఆదిలాబాద్లో గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వీటికి తోడు ఉరుములు మెరుపులతో పట్టణ జనం భయాందోళనకు గురయ్యారు. కరెంటు లేక పట్టణం చీకటిమయంగా మారింది. పిడుగులు పడటంతో మిట్టమధ్యాహ్నం ఉన్నట్లుగా భ్రమ కలిగించేలా కనిపించింది.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే