Top Ten News @ 5 PM
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1. ‘ఎంతో చర్చించాకే బోర్డుల పరిధి నిర్ణయించాం’
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని.. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ అధికారులు స్పష్టం చేశారు. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గెజిట్పై కేంద్ర జల్శక్తి శాఖ అధికారులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించారు.
2. చేనేత కార్మికులకు రాజకీయ ప్రాతినిధ్యం: కేసీఆర్
ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాస సభ్యత్వం తీసుకున్న ఎల్.రమణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ మాట్లాడుతూ... రమణ తెరాసలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు రమణ పార్టీలో చేరారని సీఎం అన్నారు. చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది. ఈ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రస్తుతం తెరాసలో నేతలెవరూ లేరు. పెద్ద జనాభా, సమస్యలు ఉన్నటువంటి వర్గం. రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేదని ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశామన్నారు.
3. ap news: గెజిట్ను స్వాగతిస్తున్నాం: ఏపీ
తెలంగాణ చర్యల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయిందని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జల్శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
4. అబద్ధాలతోనే కేసీఆర్ రెండుసార్లు సీఎం: రేవంత్
అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆయన పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. పెట్రో పన్నులతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన ‘చలో రాజ్భవన్’ కార్యక్రమం సందర్భంగా ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడారు.
TS News: చలో రాజ్భవన్ ఉద్రిక్తం
5. ఇన్సైడర్ ట్రేడింగ్పై సుప్రీంలో విచారణ
రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు, ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని పేర్కొంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది.
6. అఫ్గాన్ ఘర్షణల్లో భారత ఫొటోజర్నలిస్టు మృతి
అఫ్గానిస్థాన్లో ఆ దేశ బలగాలు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. కాందహార్లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతంలో గల కీలక పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఇటీవల తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా తాలిబన్, అఫ్గాన్ బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాయిటర్స్ సంస్థలో పనిచేస్తున్న డానిశ్.. ఈ ఘటనలను కవర్ చేస్తున్నారు. అయితే గురువారం రాత్రి జరిగిన ఘర్షణల్లో ఆయన మృతిచెందారు.
7. టీకా తీసుకున్నవారికి.. ఆస్పత్రి చేరిక తప్పినట్టే!
ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి సమయంలో నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొదటిది, అలాగే అతిపెద్దది కూడా. ఈ పరిశీలనలో భాగంగా ఆ సంస్థ పలు విషయాలను గుర్తించింది.
8. ₹499 చెల్లించి విద్యుత్తు స్కూటర్ బుక్ చేసుకోవచ్చు: ఓలా
త్వరలో విపణిలోకి విడుదల చేయనున్న తన విద్యుత్తు స్కూటర్కు బుకింగ్లు ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలాఎలక్ట్రిక్.కామ్లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ‘అద్భుత పనితీరు, సాంకేతికత, డిజైన్, ఆకర్షణీయ ధర.. ఇవన్నీ ఈ వాహనం వైపు వినియోగదారులను మొగ్గు చూపేలా చేస్తాయ’ని ఓలా ఛైర్మన్, గ్రూపు సీఈఓ భావిశ్ అగర్వాల్ తెలిపారు.
9. Stock market: ఫ్లాట్గా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం స్పల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట ధోరణి కనబరిచాయి. టెలికాం, లోహ, స్థిరాస్తి, ఇంధన, విద్యుత్తు రంగాల నుంచి లభించిన మద్దతును ఐటీ, టెక్, బ్యాంకింగ్ రంగ షేర్లు నీరుగార్చాయి. సెన్సెన్స్ 18 పాయింట్ల నష్టంతో 53,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.80 పాయింట్లు నష్టపోయి 15,923 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద నిలిచింది.
10. సభలో ఎమ్మెల్యే తుపాకీ తీస్తే కేసు నమోదు చేయరా?
2015లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు సీపీఎం శాసనసభ్యులపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలంటూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్లో ఉంచింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై విచారణ నిలిపివేయాలంటూ చేస్తున్న అభ్యర్థనలో ప్రజా ప్రయోజనం ఏమిటో చెప్పాలని నిలదీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని