Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 May 2022 13:11 IST

1. ‘నా సోదరులే హత్య చేశారు’: రెండు నెలల బాబుతో సంజన ధర్నా

నగరంలోని బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్‌ కూడలిలో మృతుడు నీరజ్‌ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు. సంజన కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్‌ చేశారు. తన సోదరులే ఈ హత్య చేసినట్లు సంజన ఆరోపించారు. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మాపై అత్యాచారాలు ఆపండి.. కేన్స్‌లో దుస్తులు చించుకుని మహిళ ఆందోళన

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తోన్న అకృత్యాలను నిరసిస్తూ ఓ మహిళ కేన్స్‌లో ఆందోళన చేపట్టింది. రెడ్‌ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం ‘త్రి థౌజెండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ లాంగింగ్‌’’ సినిమా ప్రీమియర్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎర్ర తివాచీపై నిలబడి ఫొటోలకు పోజులిస్తుండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Floods: వరద బీభత్సం.. 500 కుటుంబాలు రైల్వే ట్రాక్‌పైనే..!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8లక్షల మందికి పైగా వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జమునాముఖ్‌ జిల్లాలోని చాంగ్జురై, పటియా పాథర్‌ గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో 500లకు పైగా కుటుంబాలు రైల్వే ట్రాక్‌లపై రోజులు గడుపుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. CM KCR: అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో ఆయన భేటీ కానున్నారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరగనుంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల  22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి కేసీఆర్‌ చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో నెలకు రెండు పురస్కారాలు: బాలకృష్ణ

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలపై ఆయన తనయుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటన చేశారు. ‘‘మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయి. మా కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారు. శత జయంతి ఉత్సవాల్లో వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తాం. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరోసారి కార్ల్‌సన్‌ను ఓడించి షాకిచ్చిన ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మూడు నెలల వ్యవధిలో రెండోసారి షాకిచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘చెస్సబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌’లో పాల్గొన్న వీరిద్దరూ శుక్రవారం ఐదో రౌండ్‌లో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ హోరాహోరీగా ఆడడంతో చివరికి మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే, చివరి క్షణాల్లో కార్ల్‌సన్‌ 40వ మూవ్‌లో తప్పు చేయడంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన(రూ.300)టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే కోరింది. మొత్తం 13.35లక్షల టికెట్లకు గానూ ఉ.11గంటల వరకు 3.50లక్షల టికెట్లు బుక్‌ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈసారి ఓట్లు వేస్తే రోడ్లు వేయిస్తాం..: మేకపాటి విక్రమ్‌రెడ్డి

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఆత్మకూరు వైకాపా ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. మేకపాటి కుటుంబం 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా గ్రామానికి ఒక్కటంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేకపోయారని ఓ గ్రామస్థుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం వస్తే బురదలో నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సామ్‌-విజయ్‌లపై లిప్‌లాక్‌ సీన్స్‌..?

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ, నటి సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇంటెన్స్ ప్రేమకథగా సిద్ధమవుతోన్న ఈసినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజయ్‌-సమంతల మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కథ డిమాండ్‌ చేయడంతోనే దర్శకుడు ఈ సన్నివేశాలు సృష్టించారని, దానిని అర్థం చేసుకున్న నటీనటులు ఓకే చేశారని వార్తలు బయటకువచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సిద్ధూ @ ఖైదీ నంబరు 241383.. జైల్లో తొలిరోజు ఎలా గడిచిందంటే..

మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది జైలు శిక్ష పడటంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నిన్న కోర్టులో లొంగిపోయారు. దీంతో ఆయనను పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలు లోపలికి వెళ్లిన తర్వాత సిద్ధూకు ఖైదీ నంబరు 241383 కేటాయించారు. 10 నంబరు గదిలో ఉంచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు అదే సెల్‌లో మరో 8 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో తొలి రోజు సిద్ధూకు కాస్త కష్టంగానే గడిచినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని