Yasin Malik: ఉగ్రవాదులకు నిధుల కేసు.. యాసిన్‌ మాలిక్‌ దోషి..!

ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలాడు. ఈ మేరకు దిల్లీలోని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

Published : 19 May 2022 13:48 IST

తీర్పు వెలువరించిన దిల్లీ కోర్టు

దిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ దోషిగా తేలాడు. ఈ మేరకు దిల్లీలోని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు నేడు తీర్పు వెలువరించింది. మాలిక్‌ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. మే 25న అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.

యాసిన్‌ మాలిక్‌ ఆర్థిక పరిస్థితిపై నివేదిక అందించాలని కోర్టు ఎన్‌ఐఏ అధికారులు ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అతడికి ఎంత జరిమానా విధించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. ఈ కేసులో మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. మే 10న యాసిన్‌ మాలిక్‌ తనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.

2017లో కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్‌.. ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో నిధుల సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని