యాసిన్‌ మాలిక్‌ దోషి

ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను ఇక్కడి ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు గురువారం

Published : 20 May 2022 05:36 IST

ఉగ్ర కార్యకలాపాలకు నిధుల  కేసులో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు

దిల్లీ: ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను ఇక్కడి ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది. మాలిక్‌ ఈ నెల 10న తన నేరాలన్నింటినీ అంగీకరించిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. 25న అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. యాసిన్‌ మాలిక్‌ ఆర్థిక స్థితిపై ఎన్‌ఐఏ అధికారులు నివేదిక అందించాలని, దాన్ని పరిశీలించాక అతడికి ఎంత జరిమానా విధించాలన్నది నిర్ణయిస్తామని పేర్కొంది. 2017లో కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ‘జమ్మూ-కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌’, ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో మాలిక్‌ స్వదేశంతోపాటు విదేశాల నుంచి హవాలా, ఇతర అక్రమ మార్గాల ద్వారా నిధులు సమీకరించాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. భద్రతా దళాలపై రాళ్లదాడికి పాల్పడడం, పాఠశాలలను తగలబెట్టడం,.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా కశ్మీర్‌లో అశాంతిని సృష్టించడానికి ఈ నిధులను వినియోగించినట్లు తేలింది. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని