Cinema News: కొత్తగా ప్రయత్నిస్తున్నా..

‘‘ట్విస్ట్‌లు.. మలుపులతో ఆద్యంతం అలరించే చిత్రం ‘ధగడ్‌ సాంబ’’ అన్నారు హీరో సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోదభరిత చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు ‘ధగడ్‌ సాంబ’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కించిన

Updated : 20 May 2022 08:10 IST

‘‘ట్విస్ట్‌లు.. మలుపులతో ఆద్యంతం అలరించే చిత్రం ‘ధగడ్‌ సాంబ’’ అన్నారు హీరో సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోదభరిత చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు ‘ధగడ్‌ సాంబ’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంపూర్ణేష్‌బాబు.

‘‘కొబ్బరిమట్ట’ తర్వాత కొన్ని పెద్ద బ్యానర్స్‌లో సినిమా అవకాశాలొచ్చాయి. కొన్ని కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. ఇంతలో దర్శకుడు యన్‌.ఆర్‌.రెడ్డి ఈ కథ చెప్పారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పుడు ఓ చిన్న సమస్య వల్ల తన ఆస్తి అంతా కోల్పోతాడు. దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మళ్లీ అతనేం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథాంశం’’.

* ‘‘నేనిప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలే పోషించాను. ఇందులో తొలిసారి కాస్త సీరియస్‌గా సాగే పాత్ర పోషించా. సంభాషణలు కొత్తగా, భిన్నంగా ఉంటాయి. హీరోగా వచ్చి నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నా. దాన్ని నిలబెట్టుకోడానికి కొత్తగా ప్రయత్నిస్తూనే వస్తున్నా’’. ‘‘నేను హీరోగా ప్రస్తుతం ‘బ్రిలియంట్‌ బాబు’, ‘సన్నాఫ్‌ తెనాలి’, ‘దాన వీర శూరకర్ణ’, ‘మిస్టర్‌ బెగ్గర్‌’ చిత్రాలు చేస్తున్నా. ఈశ్వర్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నా. తమిళంలోనూ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’.


‘విక్రమ్‌’.. విచ్చేస్తున్నారు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులను హీరో నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’’ అని శ్రేష్ఠ్‌ మూవీస్‌ సంస్థ తెలిపింది. ఈ సినిమా జూన్‌ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, కూర్పు: ఫిలోమిన్‌ రాజ్‌, ఛాయాగ్రహణం: గిరీష్‌ గంగాధరన్‌.  

 


నవ్వించే ‘క్రేజీ ఫెలో’

ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్‌ కథానాయికలు. ఈ సినిమాకి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఆది చేష్టలు టైటిల్‌కు తగ్గట్లుగానే క్రేజీగా ఉన్నాయి. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌, ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని