Chandrababu in Kadapa: సీఎం ఇలాకాలో చంద్రబాబుకు జేజేలు

సీఎం జగన్‌ సొంత జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబుకు జన నీరాజనాలు పలికారు

Updated : 19 May 2022 09:20 IST

కడప: సీఎం జగన్‌ సొంత జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబుకు జన నీరాజనాలు పలికారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోగా వందల వాహనాల్లో నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్యాణ మండపానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టింది. కడపలో రహదారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. అక్కడ భారీ క్రేన్‌లతో గజమాలతో సత్కరించారు. సమావేశానంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో భారీ ర్యాలీగా పయనం కాగా చెన్నూరుకు చేరుకునే సమయానికి వర్షం మొదలైంది. వర్షాన్నీ లెక్కచేయకుండా జనం చంద్రబాబు కోసం ఎదురుచూశారు. గ్రామాల వద్ద వందల్లో నిలబడి స్వాగతం పలికారు.

ఖాజీపేటలో వేలమంది చేరగా.. చంద్రబాబు ప్రసంగించాల్సి వచ్చింది. అనంతరం కమలాపురం చేరుకునేసరికి రాత్రి 7.15 అయింది. కమలాపురం సభకు జనం భారీగా తరలివచ్చి... చంద్రబాబు ప్రసంగానికి ప్రతిస్పందనగా హోరెత్తారు. ప్రాజెక్టుల ప్రస్తావన సమయంలో సభికుల నుంచి స్పందన లభించింది. జగన్‌ను విమర్శించినప్పుడల్లా ప్రతిస్పందన కనిపించింది. కమలాపురం సభ రాత్రి 9 గంటల వరకు జరిగినా జనం సభ నుంచి కదలకుండా ఉన్నారు. విమానాశ్రయం వద్ద భద్రతాపరమైన ఆంక్షలు పెట్టడంతో కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని