IND vs NZ: ఆరోజు నేను మళ్లీ క్రికెట్‌ ఆడతానా అనుకున్నా: అశ్విన్

గతేడాది న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని, అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నానని టీమ్ఇండియా...

Published : 30 Nov 2021 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా తాను మళ్లీ క్రికెట్‌ ఆడతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నానని.. అప్పుడు తన జీవితంలో ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నానని టీమ్ఇండియా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. తాజాగా అతడు టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్న హర్భజన్‌సింగ్‌ (417)ను అధిగమించిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌ వేదికగా కివీస్‌తో ఆడిన తొలి టెస్టులో అశ్విన్‌ సోమవారం 419వ వికెట్‌ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌తో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా 2020 ఫిబ్రవరి 29న న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా తలపడిన రెండో టెస్టులో నేను ఆడలేదు. దీంతో ఆరోజే నేను మళ్లీ క్రికెట్‌ ఆడతానా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయా. నా భవిష్యత్‌ ఎటు పోతుంది? నేను ఆడే ఏకైక ఫార్మాట్‌ టెస్టు క్రికెట్‌. అందులో మళ్లీ కొనసాగుతానా? అనిపించింది. కానీ, దేవుడు నా పట్ల దయ చూపించాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని మళ్లీ రాణించా. తర్వాత నేను నీ (శ్రేయస్‌) సారథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఐపీఎల్‌ ఆడాను. అక్కడి నుంచే నా పరిస్థితులు మారిపోయాయి’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

హర్భజనే నాకు ప్రేరణ..

ఇక తాను ఆఫ్ స్పిన్నర్‌గా మారడానికి హర్భజన్‌సింగే ప్రధాన కారణమని అశ్విన్‌ చెప్పాడు. ‘నేనెప్పుడూ ఆఫ్‌ స్పిన్నర్‌ అవుతానని ఊహించలేదు. 2001లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు భజ్జీ బౌలింగ్‌ చూసి మంత్రముగ్ధుడినయ్యా. అప్పుడే తొలిసారి హర్భజన్‌ను చూశా. దాంతో ఆ సిరీస్‌ తర్వాత బంతి అందుకొని ఆఫ్‌స్పిన్‌ వేయడం ప్రారంభించా. చివరికి ఇలా ఈ స్థాయికి చేరుకున్నా. నన్ను ఎంతగానో ప్రేరేపించిన హర్భజన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. అతడి రికార్డును చేరుకోవడం గొప్ప మైలురాయి. ఇది ఎంతో గర్వించాల్సిన విషయం’ అని వెటరన్‌ స్పిన్నర్ సంతోషంగా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని